అందరూ అమెరికాకే..! ఏపీ విద్యార్థుల తొలి డెస్టినేషన్. ఆ తర్వాత స్థానాల్లో కెనడా, యూకే, ఆస్ట్రేలియా.
• స్టెమ్ కోర్సులు, రీసెర్చ్, పార్టమ్ జాబ్స్, ఓపీటీ, హెచ్-1బీ అవకాశాలే ప్రధాన ఆకర్షణ గ్రామీణ ప్రాంతాల నుంచి నగరాలకు విద్యార్థులు.
• విజయవాడ, విశాఖ, గుంటూరు నగరాల్లో ఇప్పటికే టోఫెల్, కోచింగ్ అకాడెమీలు.
• మాక్ టెస్టులు, అడ్మిషన్ కౌన్సిలింగ్లు నిర్వహిస్తున్న నిర్వాహకులు.
• విదేశీ విద్యలో ఇప్పటికే ఏపీకి గ్లోబల్ గుర్తింపు.
ఆంధ్రప్రదేశ్ యువత ప్రపంచ విద్యా పటంలో తనదైన ముద్ర వేస్తోంది. విదేశీ ఉన్నత విద్య లక్ష్యంగా సాగుతున్న ప్రయాణంలో టోఫెల్ (టెస్ట్ అఫ్ ఇంగ్లీష్ యాజ్ ఎ ఫారిన్ లాంగ్వేజ్ ) పరీక్షల ద్వారా ఏపీ విద్యార్థులు దేశంలోనే కీలక పాత్ర పోషిస్తున్నారు. అమెరికా, కెనడా, బ్రిటన్, ఆస్ట్రేలియా వంటి దేశాల్లో చదువుకోవాలనే ఆకాంక్షతో ప్రతి ఏటా వేలాది మంది ఏపీ విద్యార్థులు టోఫెల్పరీక్ష రాస్తుండగా... తాజాగా ఎడ్యుకేషనల్ టెస్టింగ్ సర్వీస్ (ఈటి ఎస్) విడుదల చేసిన గణాంకాలు ఈ ధోరణిని మరింత స్పష్టంగా చూపిస్తున్నాయి. విదేశీ విద్యకు అవసరమైన ఇంగ్లీష్ నైపుణ్యాన్ని కొలిచే టోఫెల్ పరీక్షలో ఆంధ్రప్రదేశ్ విద్యార్థుల సంఖ్య గణనీయంగా పెరుగుతోంది. దేశవ్యాప్తంగా టోఫెల్ రాసే విద్యార్థుల్లో ఏపీ నుంచి పెద్ద సంఖ్యలో అభ్యర్థులు పాల్గొంటుండటం... రాష్ట్రంలో ఉన్న విద్యా ఆకాంక్షకు నిదర్శనంగా నిలుస్తోంది. హైదరాబాద్ తర్వాత దేశంలోనే ముఖ్యమైన టోఫెల్ హబ్ గా పేరొందిన నగరాల్లో విజయవాడ, విశాఖపట్నం, గుంటూరు వంటి ఏపీ నగరాలు ముందువరుసలో ఉన్నాయి. ప్రత్యేకంగా విజయవాడ, విశాఖపట్నం గుంటూరు నగరాల నుంచి పెద్ద సంఖ్యలో విద్యార్థులు టోఫెల్ రాస్తుండటం విశేషం. ఇది రాష్ట్రవ్యాప్తంగా కోచింగ్ సెంటర్లు, అంతర్జాతీయ విద్యా కన్సల్టెన్సీలు, డిజిటల్ లెర్నింగ్ ప్లాట్ఫాంల ప్రభావం పెరుగుతున్నట్లు స్పష్టం చేస్తోంది.
ఈటిఎస్ దృష్టిలో ఏపీ
ఈటిఎస్ గ్లోబల్ పార్టనర్షిప్స్ సేల్స్ విభాగం తెలిపిన వివరాల ప్రకారం... ఆంధ్రప్రదేశ్ ఈటిఎస్ కి కీలకమైన ఫోకస్ మార్కెట్గా మారింది. పెద్దసంఖ్యలో టోఫెల్ అభ్యర్థులు ఉండటం, విదేశీ విద్యపై యువతలో ఉన్న ఆకాంక్ష, రాష్ట్రంలో పెరుగుతున్న విద్యా మౌలిక సదుపాయాలు, ఇవన్నీ ఈటిఎస్ దృష్టిని ఏపీపై కేంద్రీకరించాయి. ఈటిఎస్ ప్రతినిధులు పేర్కొన్నట్లుగా గ్లోబల్ అడ్మిషన్ మార్గాల్లోకి అడుగుపెట్టే విద్యార్థులకు మేము పూర్తి మద్దతు అందిస్తున్నాం.
ఆంధ్రప్రదేశ్ ఈ ప్రయాణంలో కీలక భాగస్వామి. 2026 నుంచి కొత్త టోఫెల్ ఏపీ విద్యార్థులకు మరింత లాభం చేకూర్చేలా 2026 జనవరి నుంచి టోఫెల్ లో భారీ మార్పులు రానున్నాయి.
అమెరికానే తొలి ఎంపిక
ఏపీ విద్యార్థుల గమ్యస్థానాల విషయానికి వస్తే అమెరికా ఇప్పటికీ నెంబర్ వన్ డెస్టినేషన్గా కొనసాగుతోంది. ఈటిఎస్ గణాంకాల ప్రకారం 55 శాతం మంది ఏపీ విద్యార్థులు అమెరికాను ఎంచుకుంటున్నారు. ఇది దేశవ్యాప్తంగా ఉన్న సగటు తో పోలిస్తే చాలా ఎక్కువ. అమెరికా తర్వాత కెనడా, యునైటెడ్ కింగ్ డమ్, ఆస్ట్రేలియా దేశాలు ఏపీ విద్యార్థులకు ప్రధాన ఎంపికలుగా ఉన్నాయి. అమెరికాలో స్టెమ్ కోర్సులు, రీసెర్చ్ అవకాశాలు, పార్ట్ టైమ్ ఉద్యోగాలు ఓపిటి, హెచ్1బీ వంటి వీసా అవకాశాలు ఏపీ యువతను ఆకర్షిస్తున్నాయి. ముఖ్యంగా ఇంజినీరింగ్, కంప్యూటర్ సైన్స్, డేటా అనలిటిక్స్, బయోటె క్నాలజీ వంటి కోర్సుల్లో ఏపీ విద్యార్థుల హవా కొనసాగుతోంది.
కోచింగ్ హబ్ లుగా మారుతున్న ఏపీ నగరాలు విదేశీ విద్య లక్ష్యంగా టోఫెల్, జిఆర్ (గ్రాడ్యుయేట్ రికార్డు ఎగ్జామినేషన్స్) ఐఈఎల్టిఎస్ పరీక్షలకు సన్నద్ధమయ్యే విద్యార్థులతో విజయవాడ, విశాఖపట్నం, గుంటూరు నగరాలు కొత్త విద్యా కేంద్రాలుగా మారుతున్నాయి. ఇప్పటికే ఈ నగరాల్లో ప్రత్యేక టోఫెల్ అకాడమీలు ఆన్లైన్, ఆఫ్లైన్ కోచింగ్, మాక్ టెస్టులు విదేశీ యూనివర్సిటీ అడ్మిషన్ కౌన్సెలింగ్ వేగంగా విస్తరిస్తున్నాయి. గ్రామీణ ప్రాంతాల నుంచి కూడా విద్యార్థులు ఈ నగరాలకు చేరుకుని విదేశీ విద్య కలలను సాకారం చేసుకునేందుకు ప్రయత్నిస్తున్నారు.
ముఖ్యమైన మార్పులు
కొత్త ప్రశ్నల ఫార్మాట్, రీడింగ్, లిసనింగ్లో అడాప్టివ్ టెస్టింగ్ విధానం, విద్యార్థి ప్రతిభకు అనుగుణంగా ప్రశ్నల కఠినత,72 గంటల్లోనే స్కోర్లు విడుదల. ఇంటి నుంచే పరీక్ష రాసే విధానంలో మెరుగుదల ఈటిఎస్ శిక్షణ పొందిన ప్రాక్టర్లు ఎఐ ఆధారిత గుర్తింపు ధృవీకరణ ఈ మార్పులతో ఏపీ విద్యార్థులకు అంతర్జాతీయ ప్రమాణాలకు తగ్గ పరీక్ష అనుభవం లభించనుంది.
డ్యుయల్ స్కోర్ విధానం
టోఫెల్లో ఇకపై ప్రస్తుత 0-నుంచి 120 స్కేల్ కొనసాగుతుంది. అదనంగా సిఈఎస్ఆర్ ప్రమాణాలకు అనుగుణంగా 1నుంచి 6 బ్యాండ్ స్కోర్ ప్రవేశపెడతారు. దీంతో యూరప్ సహా ప్రపంచవ్యాప్తంగా ఉన్న యూనివర్సిటీలకు స్కోర్ అర్థం చేసుకోవడం మరింత సులభం కానుంది. ఇది ఏపీ విద్యార్థుల అడ్మిషన్ అవకాశాలను మరింత పెంచనుంది. రాష్ట్ర యువతకు కొత్త అవకాశాలు విదేశీ విద్య అంటే కేవలం డిగ్రీ మాత్రమే కాదు, గ్లోబల్ ఎక్స్పోజర్ అంతర్జాతీయ ఉద్యోగ అవకాశాలు స్టార్టప్ రీసెర్చ్ అవకాశాలు ఇవన్నీ ఏపీ యువతను ప్రపంచానికి మరింత దగ్గర చేస్తున్నాయి. ప్రత్యేకంగా మధ్యతరగతి కుటుంబాల నుంచి వచ్చే విద్యార్థులు కూడా ఇప్పుడు ధైర్యంగా విదేశీ విద్య వైపు అడుగులు వేస్తున్నారు.
భవిష్యత్ దిశ
విదేశీ విద్యపై పెరుగుతున్న ఆసక్తి, టోఫెల్ గణాంకాల్లో ఏపీ ఆధిపత్యం, ఈటిఎస్ వంటి గ్లోబల్ సంస్థల దృష్టి, ఇవన్నీ కలిసి ఆంధ్రప్రదేశ్ను అంతర్జాతీయ విద్యా హబ్ తీర్చిదిద్దే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. యువత ఆశయాలకు దారి చూపే విధంగారాష్ట్ర ప్రభుత్వం విద్యా సంస్థలు ప్రైవేట్ కోచింగ్ రంగం సమన్వయంతో ముందుకెళితే ఏపీ పేరు ప్రపంచ విద్యా పటంలో మరింత ఎత్తుకు చేరడం ఖాయం.
.jpeg)